మేడిపల్లి, బొడుప్పల్లో మల్లారెడ్డి ధర్నా.. కాంగ్రెస్పై విమర్శలు
- గజ్వేల్లో ‘బాకీ కార్డుల’ పంపిణీ.. కాంగ్రెస్ హామీలపై బీఆర్ఎస్ ఎటాక్
BRS Protest: కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పలు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందంటూ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. మరోవైపు మేడ్చల్ జిల్లా మేడిపల్లి, బొడుప్పల్ ప్రాంతాల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ నిరసనలు చేపడుతున్నామని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు.
గజ్వేల్లో బీఆర్ఎస్ ఇన్చార్జ్ ఒంటేరు ప్రతాప్రెడ్డి ఆధ్వర్యంలో ‘బాకీ కార్డుల’ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు, ఇంకా అమలు చేయాల్సిన అంశాలను ప్రజలకు గుర్తు చేసేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పార్టీ నేతలు తెలిపారు. మేడ్చల్ డివిజన్లోని మార్కెట్ రోడ్డులో బీఆర్ఎస్ శ్రేణులు సుమారు 100 మీటర్ల పొడవైన ఫ్లెక్సీ ఏర్పాటు చేసి నిరసన ర్యాలీ నిర్వహించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.



