తుక్కుగూడలో నర్సు శిరీష అనుమానాస్పద మృతి.. హత్య కేసులో నిందితుడి అరెస్ట్
- నర్సు శిరీష మృతి కేసులో కీలక మలుపు.. బీహార్కు చెందిన వ్యక్తి అరెస్ట్
Thukkuguda Nurse Sireesha: తుక్కుగూడలోని ప్రైమ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న శిరీష అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. విధుల్లో ఉన్న సమయంలో శిరీష మృతి చెందడంతో తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఆస్పత్రి సిబ్బందిని విచారించడంతో పాటు శిరీష మృతికి గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తులో శిరీషను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. బీహార్కు చెందిన సైనా ఉల్లా (35)ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు కిటికీ నుంచి ఆస్పత్రిలోకి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం శిరీషపై అత్యాచారానికి ప్రయత్నించినట్లు, ఆమె ప్రతిఘటించడంతో గొంతు నులిమి హత్య చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు పేర్కొన్నారు. హత్య అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారైనట్లు తెలిపారు.
శిరీష మృతి ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగించారు. ఈ క్రమంలో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలను తెలుసుకునేందుకు శంషాబాద్ డీసీపీ రాజేష్ ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.



