పాలచర్లలో తెల్లవారుజామునే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ
- వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్లు.. పాలచర్లలో కార్యక్రమం
NTR Bharosa Pensions: అనంతపురం జిల్లా రాప్తాడు మండలం పాలచర్ల గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ హిందూపురం పార్లమెంట్ అధికార ప్రతినిధి పాలచర్ల ముత్యాలప్పతో పాటు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
గ్రామంలోని వృద్ధులు, వితంతువులు, వికలాంగులు తదితర లబ్ధిదారుల ఇళ్లకు తెల్లవారుజామునే వెళ్లిన సిబ్బంది, లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు. తమ ఇళ్ల వద్దకే వచ్చి పింఛన్లు అందించడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి వారికి వివరించారు.
అనంతరం పాలచర్ల ముత్యాలప్ప మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలు అందేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు సకాలంలో అందేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు.



