ఆన్లైన్లో కూతురి పెళ్లి.. అక్షింతలు వేసిన తల్లిదండ్రులు
- అమెరికాలో ప్రేమ పెళ్లి.. ఆన్లైన్లో పెళ్లి చూసిన తల్లిదండ్రులు
Online Wedding: సూర్యాపేట జిల్లా హుజూర్నగర్కు చెందిన హిమబిందు ఉద్యోగ నిమిత్తం అమెరికా వెళ్లింది. అక్కడ ఎన్టీఆర్ జిల్లాకు చెందిన రోహిత్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. కొంతకాలానికి వీరి పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని హిమబిందు తన తల్లిదండ్రులకు తెలియజేయగా.. వారు కూడా అంగీకరించారు. అమెరికాలోనే హిమబిందు, రోహిత్ వివాహం చేసుకున్నారు. అయితే దూరంగా ఉన్న తల్లిదండ్రులు కూడా పెళ్లి వేడుకలో భాగమయ్యారు.
ఆన్లైన్ ద్వారా వివాహ వేడుకను వీక్షించిన హిమబిందు తల్లిదండ్రులు జయరాజు, జ్యోతి.. కూతురిని ఆశీర్వదిస్తూ అక్షింతలు వేశారు. దూరంగా ఉన్నప్పటికీ ఆన్లైన్ ద్వారా కూతురి పెళ్లిని చూసి ఆనందించారు.కూతురి వివాహం సందర్భంగా హుజూర్నగర్లోని తమ గ్రామంలో తల్లిదండ్రులు బంధువులు, గ్రామస్తులకు పెళ్లి విందు ఏర్పాటు చేశారు. అమెరికాలో వివాహం జరిగినప్పటికీ.. స్వగ్రామంలో కూడా వేడుక వాతావరణం కనిపించింది. ఆన్లైన్లో పెళ్లి చూసి అక్షింతలు వేసి, అనంతరం గ్రామంలో విందు ఏర్పాటు చేసిన హిమబిందు తల్లిదండ్రుల తీరు స్థానికంగా ఆసక్తికరంగా మారింది.



