సిద్దిపేటలో 22A ఆంక్షలపై భారీ ధర్నా.. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఆగ్రహం
- 22A ఆంక్షలు ఎత్తివేయాలి.. రైతుల పక్షాన బీజేపీ పోరుబాట
Siddipet 22A Lands: సిద్దిపేటలో 22A ఆంక్షల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా బీజేపీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఏళ్ల తరబడి తమ ఆధీనంలో ఉండి సాగు చేసుకుంటున్న భూముల విషయంలో రైతులు, సామాన్య కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈ ధర్నాలో మెదక్ ఎంపీ ఎం. రఘునందన్రావు ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో బాధిత రైతులు, కుటుంబాలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
22A నిబంధనల కారణంగా నిజమైన భూ యజమానులు తమ భూములను రిజిస్ట్రేషన్ చేసుకోవడం, విక్రయించడం, ఇతర హక్కులను వినియోగించుకోవడం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. భూములపై స్పష్టమైన హక్కులు ఉన్నప్పటికీ నిషేధిత జాబితాలో పేర్లు ఉండటంతో రైతులు తీవ్ర అనిశ్చితికి గురవుతున్నారని తెలిపారు. గతంలో ధరణి పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుతం భూ భారతి, 22A ఆంక్షల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని విమర్శించారు.
భూముల సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రతి రైతు, ప్రతి కుటుంబానికి న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా ఉంటుందని నాయకులు తెలిపారు. అసలైన హక్కుదారుల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి, రిజిస్ట్రేషన్లు మరియు భూ హక్కుల విషయంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్లోనూ పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.



