ఈకే నరసింహుడు, ఎల్లమ్మ నరేష్లతో ప్రాణహాని ఉంది: ఎస్పీని ఆశ్రయించిన మల్లారెడ్డి
- కొండాపురం స్థల వివాదంలో దాడి: అనంతపురం ఎస్పీకి బాధితుల ఫిర్యాదు
Anantapur Police: అనంతపురం జిల్లా పామిడి మండలం కొండాపురం గ్రామపంచాయతీ పరిధిలోని బుడగ జంగాల కాలనీలో స్థల వివాదం నేపథ్యంలో తమపై దాడి జరిగిందని తాటికొండ ఆంజనేయులు (మల్లారెడ్డి) ఆరోపించారు. ఈ ఘటనలో తమ కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. ఈకే నరసింహుడు, ఎల్లమ్మ నరేష్ తదితరుల వల్ల తమకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ అనంతపురం జిల్లా ఎస్పీని ఆశ్రయించారు.
బాధితుల వివరాల ప్రకారం.. ఈకే నరసింహుడు, ఎల్లమ్మ నరేష్, నాగయ్య, రామాంజినమ్మ, రమణమ్మ, రంగమ్మ, సరోజ తదితరులు కలిసి ఈ నెల 27వ తేదీ రాత్రి సుమారు 9 గంటల సమయంలో తమపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. కట్టెలు, రాళ్లు, బ్యాట్లతో దాడి చేయడంతో తాటికొండ ఆంజనేయులు (మల్లారెడ్డి), తాటికొండ నరసమ్మ, ఆంజనేయులు, సింహాద్రి, నరసమ్మ, సలమ్మ, కుళ్లాయప్ప, నాగేశ్వరమ్మ తదితరులు గాయపడినట్లు తెలిపారు.
దాడి అనంతరం బాధితులు పామిడి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే తమపై పోలీస్ స్టేషన్లోనే ఫిర్యాదు చేస్తారా అంటూ మరోసారి దాడికి ప్రయత్నించినట్లు బాధితులు ఆరోపించారు. అంతేకాకుండా పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా ఈకే నరసింహుడు, ఎల్లమ్మ నరేష్ కుటుంబ సభ్యులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తమకు భద్రత కల్పించాలని కోరుతున్నారు.
తమకు ప్రాణహాని ఉందని, జరిగిన దాడిపై సమగ్రంగా విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతూ తాటికొండ ఆంజనేయులు (మల్లారెడ్డి) అనంతపురం జిల్లా ఎస్పీకి వినతిపత్రం అందజేశారు. స్థల వివాదం కారణంగా ఇరు వర్గాల మధ్య ఏర్పడిన పరిస్థితులపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి, బాధితులకు రక్షణ కల్పించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.



