పార్కుల జోలికి రావొద్దు.. లాల్‌బాగ్‌లో బెంగళూరువాసుల ఆందోళన

పార్కుల జోలికి రావొద్దు.. లాల్‌బాగ్‌లో బెంగళూరువాసుల ఆందోళన

  • పార్కుల పరిరక్షణ కోసం గళమెత్తిన బెంగళూరు.. నిరసనలో ఎంపీ తేజస్వి సూర్య

Bengaluru Park Protection: బెంగళూరులోని లాల్‌బాగ్‌లో ఆదివారం నగరంలోని పార్కులను పరిరక్షించాలంటూ భారీ నిరసన జరిగింది. 5 వేల మందికి పైగా బెంగళూరువాసులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. నగరంలోని పార్కులను ఇతర అవసరాలకు వినియోగించకుండా కాపాడాలని డిమాండ్ చేస్తూ ‘పార్కుల జోలికి రావొద్దు’ అంటూ నినాదాలు చేశారు.

కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారం ప్రభుత్వ పార్కు భూముల్లో 5 శాతం వరకు ప్రజా మౌలిక వసతుల కోసం ఉపయోగించుకునే అవకాశం కల్పించడంపై నిరసనకారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపాదిత హెబ్బాళ్‌–సిల్క్‌బోర్డ్‌ టన్నెల్‌ రోడ్డుకు పార్కు భూములను ఉపయోగించే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పార్కులు, పచ్చని ప్రాంతాలు నగరానికి ఎంతో అవసరమని, వాటిని ఇతర నిర్మాణాల కోసం వినియోగించకూడదని బెంగళూరువాసులు కోరుతున్నారు.

Read More సొరంగంలో చిక్కుకున్న ఇద్దరిని రక్షించిన నేపాల్‌ ఆర్మీ

ఈ నిరసనలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యతో పాటు పర్యావరణవేత్తలు, నగరంలోని వివిధ ప్రాంతాల నివాసితులు పాల్గొన్నారు. పార్కు భూములను మౌలిక వసతుల కోసం వినియోగించేందుకు వీలు కల్పించే చట్ట సవరణను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. నగర అభివృద్ధి అవసరమే అయినప్పటికీ.. అందుకోసం బెంగళూరులోని పార్కులు, పచ్చదనాన్ని కోల్పోయే పరిస్థితి రాకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని కోరారు.