NEET పరీక్ష కేంద్రంలో షాకింగ్ ఘటన.. మద్యం మత్తులో వచ్చిన విద్యార్థి
- మద్యం మత్తులో NEET పరీక్షకు హాజరు.. పరీక్ష హాల్ నుంచి విద్యార్థి ఔట్
NEET Exam: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడలోని నిట్ పీజీ పరీక్ష కేంద్రంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్కు చెందిన మహమ్మద్ రిజ్వాన్ అనే విద్యార్థి మద్యం మత్తులో NEET పరీక్షకు హాజరైనట్లు సమాచారం. సెక్యూరిటీ చెకింగ్ను దాటుకుని నేరుగా పరీక్ష హాల్లోకి వెళ్లి తన సీటులో కూర్చున్నట్లు తెలుస్తోంది.
అయితే పరీక్ష హాల్లో విద్యార్థి ప్రవర్తన తీరును గమనించిన సిబ్బందికి అనుమానం వచ్చింది. అతడి నుంచి మద్యం వాసన రావడంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విద్యార్థిని పరిశీలించారు. పరిస్థితిని గమనించిన సిబ్బంది అతడిని పరీక్ష రాయనివ్వకుండా హాల్ నుంచి బయటకు పంపించారు.
అనంతరం విద్యార్థికి బ్రెత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించినట్లు సమాచారం. పరీక్ష కేంద్రంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో వారు అక్కడికి చేరుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించి విద్యార్థిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
సెక్యూరిటీ తనిఖీలను దాటుకుని విద్యార్థి పరీక్ష హాల్ వరకు ఎలా చేరుకున్నాడనే అంశంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. పరీక్ష కేంద్రంలో భద్రతా ఏర్పాట్లు, తనిఖీల తీరుపై వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం.
NEET వంటి కీలకమైన పరీక్షకు విద్యార్థి మద్యం మత్తులో హాజరైన ఘటనతో పరీక్ష కేంద్రంలో కొద్దిసేపు కలకలం నెలకొంది. విద్యార్థి ప్రవర్తనతో అనుమానం వచ్చిన వెంటనే సిబ్బంది స్పందించి అతడిని బయటకు పంపడం, అనంతరం బ్రెత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.



