పర్యావరణ పరిరక్షణలో మెగా మనసు.. సీడ్ గణేశ్ ప్రతిమలను ఆవిష్కరించిన చిరంజీవి
- మెగాస్టార్ చేతుల మీదుగా ‘సీడ్ గణేశా’.. ప్రకృతి ప్రేమికుడిగా చిరంజీవి ఇచ్చిన సూపర్ గిఫ్ట్
Chiranjeevi: వినాయక చవితి సందర్భంగా పర్యావరణానికి మేలు చేసేలా సీడ్ గణేశుడిని పూజించాలని మెగాస్టార్ చిరంజీవి సూచించారు. పూజల అనంతరం నిమజ్జనం చేసిన తర్వాత అదే ప్రతిమ నుంచి మొక్కలు పెరిగేలా రూపొందించిన సీడ్ గణేశా ప్రతిమలను చిరంజీవి, మాజీ ఎంపీ సంతోష్రావు కలిసి ఆవిష్కరించారు. భక్తి, పర్యావరణ పరిరక్షణ రెండింటినీ కలిపే ఈ ఆలోచన ప్రత్యేకంగా నిలిచింది.
సీడ్ గణేశుడిని పూజించడం ద్వారా ఒకవైపు పండుగ సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే.. మరోవైపు ప్రకృతికి మేలు చేసే అవకాశం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. నిమజ్జనం తర్వాత ప్రతిమలోని విత్తనాల నుంచి మొక్కలు పెరిగేలా ఈ గణేశ విగ్రహాలను రూపొందించారు. దీంతో పూజలందుకున్న వినాయకుడు ఆ తర్వాత మొక్క రూపంలో ఇంటి వద్దనే పెరిగి పచ్చదనాన్ని పెంచేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.
పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణ కోసం సంతోష్రావు చేస్తున్న ప్రయత్నాలను చిరంజీవి అభినందించారు. పండుగలను ప్రకృతికి హాని కలగకుండా జరుపుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. భక్తితో పాటు పర్యావరణాన్ని కాపాడే ఆలోచనలకు ప్రజలు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సీడ్ గణేశా కార్యక్రమం ద్వారా మరింత పచ్చదనం పెరగాలని ఆకాంక్షించారు.



