అనంత లక్ష్మి కళాశాలలో అవగాహన సదస్సు.. చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సీఐ హేమంత్ కుమార్
- సైబర్ నేరాలకు దూరంగా ఉండాలి.. ఇటుకలపల్లి సీఐ హేమంత్ కుమార్
Anantapur News: అనంతపురం జిల్లా ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అనంత లక్ష్మి ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఇటుకలపల్లి సీఐ హేమంత్ కుమార్, ఎస్సై, మహిళా పోలీస్ స్టేషన్ సీఐతో కలిసి నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు చట్టాలు, మహిళలు–పిల్లల రక్షణ, మాదకద్రవ్యాల నివారణ, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకుని భవిష్యత్లో బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని సీఐ హేమంత్ కుమార్ సూచించారు.
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ కళాశాలల్లో ర్యాగింగ్ పూర్తిగా నిషేధమని, ర్యాగింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరించడంతో పాటు POCSO చట్టం, బాల్యవివాహాల నిషేధ చట్టం, మహిళలు మరియు చిన్నారుల రక్షణకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళలు రక్షణ పొందేందుకు ‘శక్తి యాప్’ ఉపయోగపడుతుందని వివరించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అధికారులు సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, ఆన్లైన్లో సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ సహాయం కోసం 100 లేదా 112, సైబర్ నేరాల ఫిర్యాదులకు 1930, బాలల సహాయం కోసం 1098 నంబర్లను సంప్రదించాలని తెలిపారు. మహిళల రక్షణ/సహాయం కోసం అందుబాటులో ఉన్న అధికారిక సహాయ వ్యవస్థలను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



