మద్యం తాగి బస్సు నడుపుతూ పట్టుబడ్డ డ్రైవర్.. ఇబ్రహీంపట్నంలో ఘటన
- డ్రంక్ అండ్ డ్రైవ్లో ట్రావెల్స్ బస్సు డ్రైవర్
Gupta Travels: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ పట్టుబడ్డాడు. గుప్తా ట్రావెల్స్కు చెందిన బస్సును డ్రైవర్ మద్యం సేవించి నడుపుతున్నట్లు పరీక్షల్లో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ సమయంలో బస్సులో సుమారు 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
విజయవాడ నుంచి జగదల్పూర్కు వెళ్తున్న ఈ బస్సును ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ వద్ద ట్రాఫిక్ పోలీసులు తనిఖీ చేశారు. డ్రైవర్కు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష నిర్వహించగా మద్యం సేవించినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రయాణికులతో నిండిన బస్సును మద్యం సేవించి నడపడం తీవ్ర నిర్లక్ష్యమని, డ్రైవర్ కారణంగా 35 మంది ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు.
ఇటీవల ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు వరుస ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో డ్రైవర్లపై మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో సుదూర ప్రాంతాలకు ప్రయాణించే బస్సుల డ్రైవర్లు మద్యం సేవించకుండా, నిబంధనలు పాటించేలా అధికారులు పర్యవేక్షణ పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఇబ్రహీంపట్నం ఘటనలో డ్రైవర్పై ట్రాఫిక్ పోలీసులు తదుపరి చర్యలు చేపట్టారు.



