రేవంత్ రెడ్డిని బొంద పెట్టాలి.. హరీశ్ రావు ముందు మహిళా రైతు ఆవేదన
- రైతు సమస్యపై హరీశ్ రావు ముందు మహిళా రైతు కన్నీటి గోడు
Harish Rao: కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఓ మహిళా రైతు తన భూమికి సంబంధించిన సమస్యను మాజీ మంత్రి హరీశ్ రావు దృష్టికి తీసుకెళ్లారు. పంట రుణం కోసం బ్యాంకుకు వెళ్లగా తమ భూమి నిషేధిత జాబితాలో ఉందని బ్యాంకు సిబ్బంది చెప్పారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇదే భూమిపై క్రాప్ లోన్ మంజూరైందని, ఇప్పుడు రుణం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించినా సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు.
తమ భూమి 22ఏ కింద నిషేధిత జాబితాలో ఉందని బ్యాంకులో చెబుతున్నారని మహిళా రైతు పేర్కొన్నారు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న తమకు పంట పెట్టుబడుల కోసం బ్యాంకు రుణం ఎంతో అవసరమని, గతంలో రుణం ఇచ్చిన భూమికి ఇప్పుడు అడ్డంకులు ఎందుకు వచ్చాయో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భూమికి సంబంధించిన సమస్యను పరిష్కరించి పంట రుణం అందేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
ఈ సందర్భంగా ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళా రైతు.. ‘రేవంత్ రెడ్డిని బొంద పెట్టాలి’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతులకు రుణాలు, భూముల సమస్యలు లేకుండా చూడాల్సిన ప్రభుత్వం తమ ఇబ్బందులను పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు. హరీశ్ రావు ముందు మహిళా రైతు తన సమస్యను వివరించిన దృశ్యాలు ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. అయితే భూమి 22ఏ నిషేధిత జాబితాలోకి వెళ్లడానికి గల అసలు కారణం, రుణం నిరాకరణపై సంబంధిత అధికారుల వివరణ తెలియాల్సి ఉంది.



