రోడ్డుపై నుంచి పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
- రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ బావి వైపు దూసుకెళ్లిన బస్సు
Karimnagar Bus Accident: కరీంనగర్ జిల్లాలో టీజీఎస్ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామం సమీపంలోని రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వైపు ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి రహదారి పక్కనున్న వ్యవసాయ పొలాల వైపు దూసుకెళ్లింది. అక్కడే ఉన్న వ్యవసాయ బావి వైపు బస్సు వెళ్లడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
బస్సు బావిలోకి దూసుకెళ్లే సమయంలో అదుపు తప్పిన వాహనం బావిని ఢీకొని ఆగిపోయింది. దీంతో బస్సు బావిలో పడకుండా నిలిచిపోవడంతో భారీ ప్రమాదం తప్పినట్లైంది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని ప్రయాణికులకు సహాయం అందించారు.
బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు నుంచి పొలాల వైపు వెళ్లడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రమాదంపై సంబంధిత అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. బస్సు బావిలోకి పడి ఉంటే పరిస్థితి మరింత విషమంగా మారే అవకాశం ఉండటంతో.. తృటిలో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనతో సుందరగిరి గ్రామం పరిసరాల్లో కొద్దిసేపు కలకలం నెలకొంది.



