పది రోజులుగా కరెంట్ క‌ట్.. హాంపాపురంలో కరెంట్ కోసం అర్ధరాత్రి రోడ్డెక్కిన రైతులు

పది రోజులుగా కరెంట్ క‌ట్.. హాంపాపురంలో కరెంట్ కోసం అర్ధరాత్రి రోడ్డెక్కిన రైతులు

  • హాంపాపురం సబ్‌స్టేషన్ వద్ద రైతుల ఆందోళన.. పంటలు ఎండిపోతున్నాయంటూ ఆవేదన

Anantapur News: అనంతపురం జిల్లా రాప్తాడు మండలం హాంపాపురం విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి రైతులు ఆందోళనకు దిగారు. పొలాలకు నీరు పెట్టుకోవాల్సిన సమయంలో వ్యవసాయ విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంటలకు నీరు అందించేందుకు విద్యుత్ కోసం అర్ధరాత్రి సబ్‌స్టేషన్ గేట్ల వద్దకు వచ్చి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు.

గత పది రోజులుగా వ్యవసాయ విద్యుత్ సరఫరాలో అంతరాయం కొనసాగుతోందని రైతులు ఆరోపించారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా కరెంట్ కోసం ఎదురుచూస్తున్నా సమస్య పరిష్కారం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది రూపాయలు అప్పులు చేసి పంటలు సాగు చేస్తుంటే.. బోర్లు పనిచేయక నీరు అందక పంటలు కళ్లముందే ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ కీలకమైన పంట దశలో విద్యుత్ సమస్యల కారణంగా నష్టపోయామని, ఇప్పుడు కూడా అధికారులు స్పందించకపోతే మరోసారి తీవ్ర నష్టం తప్పదని అన్నారు.

Read More డీఎస్సీ బాధితులకు న్యాయం జరిగేదాకా తగ్గేదే లేదు: అనంత వెంకటరామిరెడ్డి

రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ఉద్యాన పంటలకు ప్రాణాధారమైన విద్యుత్‌ను సక్రమంగా అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని రైతులు పేర్కొన్నారు. రైతు పంటకు నీరు కావాలి.. నీటికి కరెంట్ కావాలని, కరెంట్ కోసం రైతు అర్ధరాత్రి సబ్‌స్టేషన్‌కు రావాల్సి వస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి సరఫరా సమస్యను వెంటనే పరిష్కరించాలని, పంటలు ఎండిపోయిన తర్వాత పరిహారం కోసం పరుగులు పెట్టించే పరిస్థితి కాకుండా పంట ఎండిపోకముందే విద్యుత్ అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.