నేడు, రేపు కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే
- కొడంగల్ టూర్కు బయలుదేరిన సీఎం.. అభివృద్ధి పనులపై రేవంత్ రెడ్డి ఫోకస్
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు, రేపు రెండు రోజులపాటు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నియోజకవర్గంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించడంతో పాటు నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. ఇందులో భాగంగా నేడు మధ్యాహ్నం 2 గంటలకు మద్దూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నిర్మాణంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను సీఎం పరిశీలించనున్నారు.
అనంతరం మధ్యాహ్నం 3.20 గంటలకు దౌల్తాబాద్ మండలం గోకఫసల్వాడ్లో నిర్మాణంలో ఉన్న బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను సీఎం రేవంత్ రెడ్డి తనిఖీ చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు దౌల్తాబాద్ పట్టణంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల పనులను పరిశీలిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 4.30 గంటలకు హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించనున్నారు. ఆయా నిర్మాణాల పురోగతి, నాణ్యత, పనులు పూర్తయ్యే గడువుపై అధికారులతో సీఎం వివరాలు తెలుసుకోనున్నారు.
హకీంపేట ఎడ్యుకేషన్ హబ్లోనే నియోజకవర్గ అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. వివిధ శాఖల పరిధిలో జరుగుతున్న పనుల పురోగతిపై అధికారులతో చర్చించి, అవసరమైన సూచనలు చేయనున్నారు. సమీక్ష అనంతరం రోడ్డు మార్గంలో కొడంగల్లోని తన నివాసానికి చేరుకోనున్నారు. నేడు కొడంగల్లోనే బస చేయనున్న ముఖ్యమంత్రి రేపు కూడా నియోజకవర్గంలో పర్యటించనున్నారు.



