ఛీ.. వీళ్లూ కొడుకులేనా.. భూమి కోసం వృద్ధ తల్లిదండ్రులపై కర్రలతో దాడి

ఛీ.. వీళ్లూ కొడుకులేనా.. భూమి కోసం వృద్ధ తల్లిదండ్రులపై కర్రలతో దాడి

  • ఆస్తుల పిచ్చి.. వృద్ధ దంపతులపై కారులో వచ్చి దాడి చేసిన పుత్రరత్నాలు

Maharashtra Crime: పూణేలోని ఇందాపూర్‌లో భూమి విక్రయానికి సంబంధించిన వివాదం వృద్ధ దంపతులపై దాడికి దారితీసింది. తల్లి పేరుపై నమోదైన భూమిని ఎందుకు విక్రయించారని ప్రశ్నిస్తూ ఇద్దరు కుమారులు తమ వృద్ధ తల్లిదండ్రులపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆగస్టు 30న సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో ఇందాపూర్ తాలూకా తరంగ్‌వాడి గ్రామ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇందాపూర్‌లోని సరస్వతీనగర్‌కు చెందిన 65 ఏళ్ల తుకారాం కిసాన్ రౌత్, ఆయన భార్య అంజనా సలీం లాన్స్ సమీపంలోని తారురోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. వారి కుమారులు సంజయ్ తుకారాం రౌత్, రాజేంద్ర తుకారాం రౌత్ టాటా నెక్సాన్ కారులో అక్కడికి వచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తల్లి అంజనా పేరుతో ఉన్న భూమిని ఎందుకు విక్రయించారని ఇద్దరూ తల్లిదండ్రులను ప్రశ్నించినట్లు సమాచారం. అనంతరం చెక్క కర్రతో దంపతులపై దాడి చేసి, దూషించడంతో పాటు విక్రయించిన భూమిని తిరిగి తీసుకోవాలని, లేకపోతే తమ సత్తా చూపిస్తామని బెదిరించినట్లు ఫిర్యాదులో ఆరోపించారు.

Read More ఈకే నరసింహుడు, ఎల్లమ్మ నరేష్‌లతో ప్రాణహాని ఉంది: ఎస్పీని ఆశ్రయించిన మల్లారెడ్డి

ఈ ఘటనపై తుకారాం రౌత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇందాపూర్ పోలీసులు సంజయ్ రౌత్, రాజేంద్ర రౌత్‌లపై కేసు నమోదు చేశారు. భూమి విక్రయం విషయంలో తలెత్తిన వివాదమే దాడికి కారణంగా పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. వృద్ధ తల్లిదండ్రులపై సొంత కుమారులే దాడి చేసినట్లు ఆరోపణలు రావడంతో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts