తాడిపత్రిలో నెల రోజుల పాటు 30 పోలీస్ యాక్ట్ అమలు
- శాంతిభద్రతల పరిరక్షణకే 30 పోలీస్ యాక్ట్: డీఎస్పీ
Tadipatri Police: అనంతపురం తాడిపత్రి సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు 30 పోలీస్ యాక్ట్ను అమలు చేస్తున్నట్లు తాడిపత్రి ఇన్చార్జి డీఎస్పీ ఏ. శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల 26వ తేదీ వరకు నెల రోజుల పాటు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని వెల్లడించారు. పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్న సమయంలో తాడిపత్రి సబ్ డివిజన్ పరిధిలో రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, వివిధ సంఘాల నాయకులు, ఇతరులు పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని డీఎస్పీ సూచించారు. ధర్నా చౌక్లలో కార్యక్రమాలు నిర్వహించాలన్నా ముందుగా పోలీసుల అనుమతి తీసుకోవాలని తెలిపారు. మైకులు, ఇతర శబ్ద పరికరాలతో కార్యక్రమాలు నిర్వహించే వారు కూడా సంబంధిత అధికారుల నుంచి ముందస్తు అనుమతి పొందాలని స్పష్టం చేశారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరైనా వ్యవహరించినా, పోలీసుల అనుమతి లేకుండా నిరసనలు, ర్యాలీలు లేదా ఇతర కార్యక్రమాలు నిర్వహించినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై పరిస్థితిని బట్టి కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా సాధారణ కార్యకలాపాలు కొనసాగించేందుకు పోలీసు శాఖ అవసరమైన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.
తాడిపత్రి సబ్ డివిజన్లో శాంతియుత వాతావరణం కొనసాగించేందుకు ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు పోలీసు శాఖకు సహకరించాలని డీఎస్పీ ఏ. శ్రీనివాస్ కోరారు. ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకుని నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని సూచించారు. 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్న కాలంలో ప్రతి ఒక్కరూ పోలీసుల సూచనలు పాటించాలని కోరారు.



