చిలకలూరిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
- వేలూరుకు చెందిన ఏడుగురు మృతి.. చిలకలూరిపేట వద్ద విషాదం
Chilakaluripet Accident: పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ఇంటర్సిటీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో పది మంది తీవ్రంగా గాయపడగా, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
మృతులను చిలకలూరిపేట మండలం వేలూరుకు చెందిన బొంతా మంగమ్మ, బాబురావు, గంగమ్మ, సంపూర్ణమ్మ, మరియమ్మ, సువార్త, లక్ష్మమ్మగా గుర్తించారు. ఒకే ప్రాంతానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోవడంతో వేలూరు గ్రామంలో విషాదం నెలకొంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బస్సు వేగం, డ్రైవర్ నిర్లక్ష్యం తదితర అంశాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.



