గుమ్మలక్ష్మీపురం ఆస్పత్రిలో సెల్‌ఫోన్‌ లైట్లతో వైద్యం

గుమ్మలక్ష్మీపురం ఆస్పత్రిలో సెల్‌ఫోన్‌ లైట్లతో వైద్యం

  • కరెంట్‌ లేక సెల్‌ఫోన్‌ లైట్లతో వైద్యం.. భద్రగిరి సీహెచ్‌సీలో రోగుల అవస్థలు

Gummlakshmipuram: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని భద్రగిరి సీహెచ్‌సీలో రోగులకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. కొద్దిరోజుల కిందట ప్రభుత్వం ప్రారంభించిన ఈ ఆస్పత్రిలో విద్యుత్‌ లేకపోవడంతో రోగులకు సెల్‌ఫోన్‌ లైట్ల వెలుగులో వైద్యం అందిస్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. గిరిజన ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఆస్పత్రిని ప్రారంభించినప్పటికీ, కనీస సదుపాయాలు లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఆస్పత్రిలో విద్యుత్‌ అంతరాయం ఏర్పడితే వెంటనే వైద్య సేవలు కొనసాగించేందుకు జనరేటర్‌ వంటి ప్రత్యామ్నాయ సౌకర్యాలు ఉండాల్సిన అవసరం ఉంది. అయితే జనరేటర్‌ లేకుండానే ఆస్పత్రిని ప్రారంభించడం ఎంతవరకు సమంజసమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అత్యవసర సమయంలో రోగులకు వైద్యం అందించాల్సిన ఆస్పత్రిలో కరెంట్‌ లేక సెల్‌ఫోన్‌ లైట్లను ఉపయోగించాల్సి రావడం దౌర్భాగ్యకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read More ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమం.. నేడు ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

పూర్తి స్థాయిలో సదుపాయాలు కల్పించకుండానే ఆస్పత్రిని ప్రారంభించి, ప్రచార ఆర్భాటం కోసం ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు గొప్పలు చెప్పుకోవడం ఎందుకని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గిరిజనుల కోసం ఏర్పాటు చేసిన ఆస్పత్రిలోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే మారుమూల ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యం ఎలా అందుతుందని నిలదీస్తున్నారు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని అంటున్నారు.

భద్రగిరి సీహెచ్‌సీలో విద్యుత్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు వెంటనే జనరేటర్‌ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఆస్పత్రికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్య సేవలు అందించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికైనా మంత్రి, ఎమ్మెల్యే, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Related Posts