సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను కలవండి.. మాట్లాడండి: మంత్రి లోకేష్

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను కలవండి.. మాట్లాడండి: మంత్రి లోకేష్

  • సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో నేరుగా మాట్లాడాలని లోకేష్ సూచన

Nara Lokesh: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో పార్టీ నేతలు, కార్యకర్తలు నేరుగా మాట్లాడాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. ఇన్‌ఫ్లుయెన్సర్లను అధికారికంగా కలుసుకుని వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని చెప్పారు. సోషల్ మీడియాలో ప్రజలపై ప్రభావం చూపుతున్న వారితో సమన్వయం చేసుకోవడం ద్వారా పార్టీ, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చని సూచించారు.

చంద్రబాబు కుప్పం వచ్చిన సమయంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను స్వయంగా కలుస్తున్నారని లోకేష్ తెలిపారు. వారితో సుమారు 30 నిమిషాల పాటు సమయం కేటాయించి మాట్లాడుతున్నారని చెప్పారు. అధినేత అంత సమయం కేటాయించి వారితో మాట్లాడుతున్నప్పుడు మనం కూడా వారిని కలుసుకుని మాట్లాడటంలో తప్పేముందని ప్రశ్నించారు.

Read More రూ.50 లక్షల విలువైన మద్యం సీసాలు ధ్వంసం చేసిన అనకాపల్లి పోలీసులు

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ఫోన్ నంబర్లు తీసుకుని వారితో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలని లోకేష్ సూచించారు. వారి నుంచి వచ్చే సూచనలు, సమస్యలను తెలుసుకుని అవసరమైన విషయాలను సంబంధిత స్థాయిలో పరిష్కరించేలా చూడాలని అన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న అభిప్రాయాలను కూడా ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు.

“ఏమైనా ఉంటే మెసేజ్ పెట్టండి.. నేను చూసుకుంటా” అని ఇన్‌ఫ్లుయెన్సర్లకు భరోసా ఇవ్వాలని లోకేష్ సూచించారు. ప్రజల్లో ప్రభావం చూపుతున్న సోషల్ మీడియా ప్రతినిధులతో సానుకూల సంబంధాలు కొనసాగిస్తూ, వారి సూచనలను స్వీకరించాలని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పనులపై సరైన సమాచారం ప్రజలకు చేరేలా ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.