నాంపల్లి తాజ్ ఐలాండ్ జంక్షన్ వద్ద యువకుడి హల్చల్
- బైక్ను సీజ్ చేసి యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Hyderabad Traffic Police: హైదరాబాద్లో ట్రాఫిక్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నాంపల్లి తాజ్ ఐలాండ్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులను దూషించడంతో పాటు విధులకు ఆటంకం కలిగించాడనే ఆరోపణలపై మహ్మద్ రిజ్వాన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. మహ్మద్ రిజ్వాన్ హెల్మెట్ లేకుండా బైక్పై ప్రయాణిస్తున్నాడు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన విషయాన్ని గుర్తించిన పోలీసులు అతడి వాహనాన్ని ఫొటో తీశారు. అనంతరం బైక్ను ఆపి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునేందుకు ప్రయత్నించారు.
ఈ సమయంలో రిజ్వాన్ ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా విధుల్లో ఉన్న సిబ్బందిని దూషిస్తూ, వారి విధులకు ఆటంకం కలిగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని, అతడు నడుపుతున్న బైక్ను సీజ్ చేశారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి మహ్మద్ రిజ్వాన్ను అరెస్ట్ చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం మాత్రమే కాకుండా విధుల్లో ఉన్న పోలీసులతో దురుసుగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.



