ఇండోనేషియాలో బద్దలైన అనక్ క్రకటోవా అగ్నిపర్వతం

ఇండోనేషియాలో బద్దలైన అనక్ క్రకటోవా అగ్నిపర్వతం

  • 25 గంటల పాటు కొనసాగిన అనక్ క్రకటోవా అగ్నిపర్వతం విస్ఫోటనం

Anak Krakatau: ఇండోనేషియాలోని అనక్ క్రకటోవా అగ్నిపర్వతం మరోసారి బద్దలైంది. సెప్టెంబర్ 4న ప్రారంభమైన నిరంతర విస్ఫోటనం సుమారు 25 గంటల పాటు కొనసాగినట్లు ఇండోనేషియా జియోలాజికల్ ఏజెన్సీ వెల్లడించింది. భారీగా బూడిద, లావా వెలువడటంతో పశ్చిమ ఇండోనేషియాలోని పలు ప్రాంతాలపై ప్రభావం పడింది. ప్రస్తుతం నిరంతర విస్ఫోటనం ముగిసినప్పటికీ.. అగ్నిపర్వత కార్యకలాపాలు పూర్తిగా తగ్గలేదని అధికారులు తెలిపారు.

అనక్ క్రకటోవా విస్ఫోటనం కారణంగా భారీగా వెలువడిన అగ్నిపర్వత బూడిద గాలిలోకి చేరింది. బూడిద మేఘాలు సుమారు 50 వేల అడుగుల ఎత్తు వరకు వ్యాపించినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఇండోనేషియాలో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జకార్తాలోని ప్రధాన విమానాశ్రయంతో పాటు పలు విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది.

Read More నేపాల్‌లో వరద బీభత్సం.. 160 మందికి పైగా మృతి, 400 మందికి పైగా గల్లంతు

విమానాశ్రయాల మూసివేతతో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజా అధికారిక లెక్కల ప్రకారం ప్రభావిత విమానాల సంఖ్య 2,300 దాటగా.. 2.7 లక్షలకు పైగా ప్రయాణికులపై ప్రభావం పడింది. బూడిద మేఘాల కదలిక, వాతావరణ పరిస్థితులను బట్టి విమానాశ్రయాల కార్యకలాపాలపై అధికారులు నిర్ణయాలు తీసుకుంటున్నారు.

మరోవైపు అనక్ క్రకటోవా పరిసరాల్లో అగ్నిపర్వత కార్యకలాపాలు ఇంకా కొనసాగుతున్నాయి. నిరంతర విస్ఫోటనం ముగిసిన తర్వాత స్ట్రోంబోలియన్ తరహా విస్ఫోటనాలు నమోదయ్యాయని ఇండోనేషియా అధికారులు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విస్ఫోటనాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం అగ్నిపర్వతాన్ని అలర్ట్ లెవల్-3లో కొనసాగిస్తున్నారు.

అగ్నిపర్వతం చుట్టూ మూడు కిలోమీటర్ల పరిధిలో ప్రజలు, పర్యాటకులు, సందర్శకులు వెళ్లవద్దని అధికారులు సూచించారు. భారీ బూడిద, వేడి రాళ్లు, అగ్నిపర్వత వాయువులు, లావా ప్రవాహం వంటి ప్రమాదాలు ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. అనక్ క్రకటోవా విస్ఫోటనం కారణంగా ప్రస్తుతం సునామీ ముప్పు లేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రజలు అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని సూచించారు.

అనక్ క్రకటోవా.. 1883లో భారీ విస్ఫోటనంతో ప్రపంచాన్ని కుదిపేసిన క్రకటోవా అగ్నిపర్వత ప్రాంతంలో ఏర్పడిన అగ్నిపర్వతం. 2018లో అనక్ క్రకటోవా విస్ఫోటనం కారణంగా సునామీ సంభవించి 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రస్తుత విస్ఫోటనాన్ని కూడా అధికారులు అత్యంత అప్రమత్తంగా పర్యవేక్షిస్తున్నారు.

Related Posts