కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై కేటీఆర్ ఫైర్
- కాంగ్రెస్ పాలనలో బాగుపడింది అనుముల కుటుంబమే
KTR BRS Working President: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ఏం చేసిందో ప్రశ్నిస్తామనే తమను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజా సమస్యలను, ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలును ప్రశ్నించేందుకు ప్రతిపక్షంగా తమకు అవకాశం ఇవ్వకుండా సస్పెన్షన్ వేటు వేశారని ఆయన విమర్శించారు.
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని ప్రజల పరిస్థితి తీవ్రంగా దెబ్బతిన్నదని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న కుటుంబాలు, ప్రజలందరూ ఇబ్బందులు పడుతూ ఆగమాగం అవుతున్నారని అన్నారు. అయితే కాంగ్రెస్ పాలనలో మాత్రం అనుముల కుటుంబం మాత్రమే బాగుపడిందని ఆయన విమర్శించారు.
అదానీ, అంబానీలతో అనుముల కుటుంబం పోటీ పడి వృద్ధిలోకి వచ్చిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. నిన్న మొన్నటి వరకు ఆవారాగా తిరిగిన అనుముల అన్నదమ్ములు నేడు ఏరోస్పేస్ వ్యాపారం చేసే స్థాయికి ఎలా వచ్చారని ఆయన ప్రశ్నించారు. అనుముల కుటుంబానికి సంబంధించిన వ్యాపారాలు, భూముల వ్యవహారాలపై కేటీఆర్ గతంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం ద్వారా సమస్యలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాగా, అసెంబ్లీ కార్యకలాపాలకు అంతరాయం కలిగించారనే కారణంతో కేటీఆర్ సహా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మిగిలిన వర్షాకాల సమావేశాల నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.



