జరగని జూడో పోటీల సర్టిఫికెట్లతో 39 మందికి ఉద్యోగాలు: వైఎస్ జగన్
- జూడో పోటీలు జరగలేదని అసోసియేషన్ లేఖ.. సర్టిఫికెట్లపై జగన్ సంచలన వ్యాఖ్యలు
YS Jagan: జరగని జూడో పోటీలకు సంబంధించిన సర్టిఫికెట్ల ఆధారంగా 39 మందికి ఎలాంటి పరీక్ష లేకుండానే టీచర్ ఉద్యోగాలు కల్పించారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరోపించారు. ఖమ్మంలో జూడో పోటీలు జరగలేదని తెలంగాణ జూడో అసోసియేషన్ రాతపూర్వకంగా లేఖ ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు.
‘జూడో ఆట’ పేరుతో 39 మందికి ఎలాంటి పరీక్ష లేకుండా టీచర్ పోస్టులు ఇచ్చారని వైఎస్ జగన్ అన్నారు. ఉద్యోగాల కోసం ఉపయోగించిన జూడో సర్టిఫికెట్ల వ్యవహారంపై సమగ్రంగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా జూడో అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరనే అంశాన్ని కూడా జగన్ ప్రస్తావించారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా విశాఖపట్నం ఎంపీ, నారా లోకేశ్ తోడల్లుడు భరత్ ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ అంశాలన్నింటినీ పరిశీలిస్తే సర్టిఫికెట్ల వ్యవహారంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని అన్నారు.
జూడో పోటీలు జరగకపోయినా సర్టిఫికెట్లు ఎలా వచ్చాయి, వాటిని ఎవరు జారీ చేశారు, వాటికి ధృవీకరణ ఎలా జరిగిందనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉందని వైఎస్ జగన్ అన్నారు. దొంగ సర్టిఫికెట్లు పుట్టించి, వాటికి వారే ధృవీకరణ చేశారనే విషయం స్పష్టంగా తెలుస్తోందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు.



