మహిళా బైకర్ను వెంబడించి కారుతో ఢీకొట్టిన పోకిరీలు
- స్పోర్ట్స్ బైక్పై వెళ్తున్న మహిళను వెంటాడిన యువకులు
Delhi News: ఢిల్లీ-గురుగ్రాంలో మహిళా బైకర్ను కొందరు పోకిరీలు కారుతో వెంబడించి ఢీకొట్టిన ఘటన కలకలం రేపింది. సియా అనే మహిళా బైకర్ స్పోర్ట్స్ బైక్పై వెళ్తుండగా కారులో వచ్చిన కొందరు యువకులు ఆమెను వెంబడించినట్లు సమాచారం. తనను ఎందుకు వెంబడిస్తున్నారని ప్రశ్నించిన సియా.. తన వెంటపడకుండా దూరంగా వెళ్లాలని వారించింది. దీంతో ఆగ్రహించిన యువకులు కారుతో ఆమె బైక్ను ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మహిళా బైకర్ తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
అదే సమయంలో సియా వెనుకే వస్తున్న ఆమె స్నేహితులు ఈ ఘటనను గమనించి కారును ఆపేందుకు ప్రయత్నించారు. అయితే కారులో ఉన్న యువకులు వారితో దుర్భాషలాడినట్లు సమాచారం. అనంతరం అక్కడి నుంచి కారులో పరారైనట్లు తెలుస్తోంది. మహిళా బైకర్ను వెంబడించి, ఆమెను కారుతో ఢీకొట్టిన ఘటనపై స్థానికంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. మహిళలను వేధిస్తూ వెంబడించడం, అడ్డుకున్నందుకు వాహనంతో ఢీకొట్టడం వంటి ఘటనలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, పోలీసుల తదుపరి చర్యలు తెలియాల్సి ఉంది.



