విజయవాడ కృష్ణలంకలో పేలుడు పదార్థాల కలకలం
- నరసరావుపేట నుంచి విజయవాడకు వచ్చిన వ్యక్తి బ్యాగ్లో పేలుడు సామగ్రి
Vijayawada Explosives Seized: విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో పేలుడు పదార్థాలు బయటపడటం కలకలం రేపింది. నరసరావుపేట నుంచి విజయవాడకు బస్సులో వచ్చిన ఉత్తరప్రదేశ్కు చెందిన అసిఫ్ అలీకి తన బ్యాగ్కు బదులుగా మరో వ్యక్తి బ్యాగ్ వచ్చినట్లు గుర్తించాడు. అనుమానంతో బ్యాగ్ను తెరిచి చూడగా అందులో పేలుడు పదార్థాలు కనిపించాయి.
బ్యాగ్లో 46 జిలెటిన్ స్టిక్స్, 50 ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆందోళనకు గురైన అసిఫ్ అలీ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న కృష్ణలంక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో బ్యాగులు మారిపోయినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే ఈ పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరి కోసం తరలిస్తున్నారు? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బ్యాగ్ అసలు యజమాని ఎవరు అన్నది కూడా గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు.
ఈ ఘటనపై కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలకు సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలిస్తున్నారు. ఘటన వెనుక ఉన్న వ్యక్తులు, ఉద్దేశంపై దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.



