వినాయక మండపాలతో రహదారుల దిగ్బంధం.. పోలీసు కమిషనర్ పట్టించుకోరా

వినాయక మండపాలతో రహదారుల దిగ్బంధం.. పోలీసు కమిషనర్ పట్టించుకోరా

  • సీసీ రోడ్లను తవ్వుతున్నా చోద్యం చూస్తున్న పోలీసులు.. కమిషనర్ స్పందించరా?

Anantapur News: అనంతపురం నగరంలోని ప్రకాశ్ రోడ్డులో వినాయక మండపం ఏర్పాటు కోసం రోడ్డును ఆక్రమించి నిర్మాణ పనులు చేపట్టడంపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మండపం నిర్మాణం కోసం సీసీ రోడ్డుకు గుంతలు కొట్టడంతో పాటు రహదారిలో కొంత భాగాన్ని వినియోగించుకోవడం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంటూ అధికారులు దృష్టికి తీసుకెళ్లారు.

ప్రకాశ్ రోడ్డులో మండపం ఏర్పాటు చేస్తున్న ప్రాంతంలో రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని స్థానికులు తమ ఫిర్యాదులో తెలిపారు. రోడ్డును పూర్తిగా లేదా ఎక్కువ భాగం ఆక్రమించి మండపం నిర్మిస్తే వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో రాకపోకలకు సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

Read More హైదరాబాద్‌–విజయవాడ హైవేపై ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి

మండపం నిర్మాణం కోసం సీసీ రోడ్డులో గుంతలు వేయడంపైనా స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల కోసం ఏర్పాటు చేసిన రోడ్డుకు నష్టం కలిగించే విధంగా నిర్మాణాలు చేపట్టకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అనుమతుల విషయంలో కూడా స్పష్టత ఇవ్వాలని, ఏ నిబంధనల ప్రకారం రోడ్డుపై నిర్మాణానికి అనుమతి ఇచ్చారో వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ విషయంపై టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు కూడా సమాచారం అందించినట్లు స్థానికులు తెలిపారు. పోలీసుల అనుమతి ఉందని నిర్వాహకులు చెబుతున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు నిబంధనలను పరిశీలించాలని కోరుతున్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా రహదారిని మూసివేయకుండా మండపం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

వినాయక చవితి వేడుకలకు ప్రజలు వ్యతిరేకం కాదని, అయితే పండుగ పేరుతో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలిగించేలా రోడ్లను ఆక్రమించడం, ప్రభుత్వ రహదారులకు నష్టం కలిగించడం సరికాదని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా అనంతపురం మున్సిపల్ అధికారులు, పోలీసు అధికారులు స్పందించి స్థలాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.