సైఫాబాద్ పీఎస్లో దాడి జరగలేదన్న డీసీపీ శిల్పవల్లి
- కేటీఆర్ పీఆర్వో, పీఏలపై దాడి జరగలేదు.. సైఫాబాద్ ఘటనపై డీసీపీ శిల్పవల్లి వివరణ
Khairatabad Zone DCP Shilpavalli: కేటీఆర్ పీఆర్వో మహేష్, పీఏ మహేందర్పై సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఎలాంటి దాడి జరగలేదని ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి స్పష్టం చేశారు. వారిపై దాడి జరిగిందంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని తెలిపారు. పోలీస్ స్టేషన్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించామని, ఎక్కడా దాడి జరిగినట్లు కనిపించలేదని పేర్కొన్నారు.
ఈరోజు ఉదయం నమోదైన కేసులో భాగంగా విచారణ కోసం కేటీఆర్ పీఆర్వో మహేష్, పీఏ మహేందర్ను పోలీస్ స్టేషన్కు పిలిచినట్లు డీసీపీ తెలిపారు. ఇదే సమయంలో స్థానికంగా ఉండే కొంతమంది యువకులు గణేష్ మండపం వద్ద డీజే ఏర్పాటుకు అనుమతి కోరుతూ సాయంత్రం పోలీస్ స్టేషన్కు వచ్చినట్లు చెప్పారు.
డీజేకు అనుమతి ఇవ్వాలని కోరిన యువకులతో సైఫాబాద్ సీఐ మాట్లాడిన సమయంలో కొంత వాగ్వాదం జరిగినట్లు డీసీపీ వివరించారు. ఆ యువకుల్లో ఒకరు కేటీఆర్ పీఆర్వోను గుర్తించి, అసెంబ్లీ వద్ద న్యూసెన్స్ చేసిన వారితో పోలీసులు మర్యాదగా కూర్చోబెట్టి మాట్లాడతారని వ్యాఖ్యానించడంతో వాగ్వాదం జరిగినట్లు తెలిపారు. సీఐ వారిని అలా మాట్లాడవద్దని వారించడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారని చెప్పారు.
అనంతరం పోలీస్ స్టేషన్లోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించామని, కేటీఆర్ పీఆర్వో, పీఏలపై ఎలాంటి దాడి జరగలేదని డీసీపీ శిల్పవల్లి తెలిపారు. అయితే బీఆర్ఎస్ నాయకులు దాడి జరిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పారు. ఈ వ్యవహారంపై పోలీసులు అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలిస్తూ విచారణ కొనసాగిస్తున్నారు.



