బేగంబజార్లో 48 కిలోల బంగారు గణేశుడు
- బేగంబజార్ ఫీల్ఖానాలో కనువిందు చేస్తున్న బంగారు గణేశుడు
Hyderabad Ganesh Chaturthi: వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్ నగరం భక్తిశ్రద్ధలతో ముస్తాబైంది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ గణేశ్ విగ్రహాలు ఏర్పాటు చేయగా.. బేగంబజార్ ఫీల్ఖానాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక గణనాథుడి విగ్రహం ఈ ఏడాది ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. సుమారు 48 కిలోల బరువున్న ఈ విగ్రహానికి 24 క్యారెట్ల బంగారు పూతతో పాటు భారీగా అమెరికన్ డైమండ్లను ఉపయోగించారు.
ఈ గణేశుడి విగ్రహాన్ని తయారు చేసేందుకు ఎనిమిది మంది నైపుణ్యం కలిగిన కళాకారులు సుమారు ఎనిమిది నెలల పాటు శ్రమించినట్లు నిర్వాహకులు తెలిపారు. విగ్రహంపై 3.8 లక్షలకు పైగా అమెరికన్ డైమండ్లను అమర్చడంతో ప్రత్యేక మెరుపుతో దర్శనమిస్తోంది. బంగారు పూత, వజ్రాల అలంకరణతో గణనాథుడిని చూసేందుకు భక్తులు ఆసక్తి చూపుతున్నారు.
మరోవైపు బాలాపూర్లోనూ వినాయక చవితి వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. భక్తులను ఆకట్టుకునేలా పండుగ వాతావరణాన్ని తీర్చిదిద్దారు. పూరీ జగన్నాథ ఆలయాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రత్యేకంగా రూపొందించిన అలంకరణలు వేడుకలకు మరింత వైభవాన్ని తీసుకొచ్చాయి. హైదరాబాద్లోని ప్రధాన గణేశ్ మండపాల వద్ద భక్తుల సందడి నెలకొంది. ప్రత్యేక అలంకరణలు, భారీ విగ్రహాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో నగరం మొత్తం పండుగ శోభను సంతరించుకుంది. బేగంబజార్లోని బంగారు-వజ్రాల గణేశుడు, బాలాపూర్లోని ప్రత్యేక ఉత్సవ వాతావరణం ఈ ఏడాది వినాయక చవితి వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి.



