పోలీసుల పర్మిషన్ ఉందంటూ సీసీ రోడ్డుకే కన్నాలు: వినాయక మండపం పేరిట దౌర్జన్యం
వినాయక మండపం కోసం రోడ్డంతా ఆక్రమణ: టూ టౌన్ పోలీసుల అనుమతితోనే ఈ తిప్పలా?
Anantapur News: అనంతపురం నగరంలోని ప్రకాష్ రోడ్డులో వినాయకుడి మండపం ఏర్పాటు కోసం రోడ్డును ఆక్రమించి నిర్మాణ పనులు చేపట్టడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మండపం నిర్మాణం కోసం సీసీ రోడ్డులో ఆరు గుంతలు ఏర్పాటు చేయడంతో రోడ్డుకు నష్టం వాటిల్లుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనంతపురం మున్సిపల్ కార్యాలయంలో అటెండర్గా పనిచేసి పదవీ విరమణ చేసిన వ్యక్తి కుటుంబ సభ్యులు మండపం ఏర్పాటుకు రోడ్డును ఆక్రమించారని స్థానికులు చెబుతున్నారు. మొత్తం రోడ్డును మండపం కోసం వినియోగించడం వల్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు.
రోడ్డుపై మండపం నిర్మాణాన్ని ప్రశ్నించిన స్థానికులకు టూ టౌన్ పోలీసులు అనుమతి ఇచ్చారని నిర్వాహకులు సమాధానం ఇస్తున్నారని ప్రజలు తెలిపారు. ఈ విషయంపై టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా స్థానికులు పోలీసులను సంప్రదించినట్లు చెప్పారు. టూ టౌన్ ఎస్సై నిర్వాహకులను పిలిపించి సూచనలు చేసినప్పటికీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని స్థానికులు పేర్కొన్నారు.
వినాయక మండపాల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చే సమయంలో ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సీసీ రోడ్డుకు నష్టం కలగకుండా చూడడంతో పాటు రోడ్డును పూర్తిగా ఆక్రమించకుండా మండపం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికైనా టూ టౌన్ పోలీసులు, సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని నగర ప్రజలు కోరుతున్నారు.



