ఇంట్లోకి చొరబడి కత్తితో వార్నింగ్.. రౌడీషీటర్ ఆటకట్టించిన అత్తాపూర్ పోలీసులు

ఇంట్లోకి చొరబడి కత్తితో వార్నింగ్.. రౌడీషీటర్ ఆటకట్టించిన అత్తాపూర్ పోలీసులు

  • నలుగురు కత్తులతో రచ్చ.. టాస్క్‌ఫోర్స్ వలలో చిక్కిన అత్తాపూర్ రౌడీషీటర్ చాంగో

Attapur Police: హైదరాబాద్ అత్తాపూర్‌లో కత్తితో బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన కేసులో రౌడీషీటర్ సయ్యద్ మహ్మద్ అలియాస్ చాంగో (25)ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసిన 12 గంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు అత్తాపూర్ పోలీసులు తెలిపారు. చాంగో సెంటరింగ్ కార్మికుడిగా, ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 4న చాంగో నూర్‌జహాన్ బేగం ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్కడ ఆమె కుమారుడు అబ్దుల్ రెహ్మాన్ గొంతుకు కత్తి పెట్టి రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడని, డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానంటూ బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. నూర్‌జహాన్‌ను కూడా కత్తితో బెదిరించి దుర్భాషలాడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Read More భట్టి అనుచరుల వేధింపులు తట్టుకోలేక రైతు ఆత్మహత్యాయత్నం

ఈ ఘటన సమయంలో అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు చాంగోను పట్టుకునేందుకు ప్రయత్నించడంతో అతడు అక్కడి నుంచి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం సెప్టెంబర్ 13న అత్తాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని 308(4), 329(4), 352 సెక్షన్లతో పాటు ఆర్మ్స్ యాక్ట్‌లోని సెక్షన్ 25(1)(A) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

కేసు దర్యాప్తులో భాగంగా అత్తాపూర్ పోలీసులు, రాజేంద్రనగర్ జోన్ టాస్క్‌ఫోర్స్‌ బృందాలు కలిసి నిందితుడి కోసం గాలింపు చేపట్టాయి. చివరకు చాంగోను అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి నాలుగు కత్తులు, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు వెల్లడించారు.