తెలంగాణ అంటేనే రాచరికానికి వ్యతిరేకం: సీఎం రేవంత్ రెడ్డి 

తెలంగాణ అంటేనే రాచరికానికి వ్యతిరేకం: సీఎం రేవంత్ రెడ్డి 

తెలంగాణ అంటేనే రాచరికానికి వ్యతిరేకమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్‌ ట్యాపింగ్ అంశం అధికారులు చూసుకుంటున్నారని తెలిపారు.

తెలంగాణ అంటేనే రాచరికానికి వ్యతిరేకమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్‌ ట్యాపింగ్ అంశం అధికారులు చూసుకుంటున్నారని తెలిపారు. అన్నింటిపై సీబీఐ విచారణ కోరే కేటీఆర్‌, హరీష్‌ రావు ఫోన్ ట్యాపింగ్‌పై ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. తాను ఫోన్ ట్యాపింగ్ చేయించడంలేదనీ.. అలాంటి పనులు చేయనని సీఎం స్పష్టం చేశారు. 

అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర గేయానికి సంగీతం సమకూర్చే బాధ్యత అందెశ్రీకే అప్పగించామని తెలిపారు. కీరవాణి వ్యవహారంతో తనకు సంబంధం లేదన్నారు. ఎవరితో సంగీతం చేయించుకోవాలనేది అందెశ్రీ నిర్ణయానికే వదిలేశామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 
 
ఇదిలా ఉంటే పక్క రాష్ట్రం ఏపీలో పోలీసు అధికారులందరినీ ఎన్నికల సమయంలో ట్రాన్స్‌ఫర్ చేశారని గుర్తు చేశారు. తెలంగాణలో ఎలాంటి ట్రాన్స్‌ఫర్ లేకుండా ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగాయని అన్నారు. ఎక్కడ కూడా అధికార దుర్వినియోగం చేశామన్న ఆరోపణలు ప్రతిపక్షాలు సైతం చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Read More డా. కోడి శ్రీనివాసులుకు అభినందనలు - MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 

మరోవైపు తెలంగాణ అంటే త్యాగాలు, పోరాటాలు గుర్తుకు వస్తాయని తెలిపారు. కాళేశ్వరంలో నిపుణులు తేల్చిందే పరిగణలోకి తీసుకుంటామని అన్నారు. నిపుణుల సూచనల మేరకే కాళేశ్వరంపై నిర్ణయాలు ఉంటాయని వివరించారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే చాలా విషయాలు ఆయనతో చర్చించేది ఉందన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్యలు, కరెంటు కోతలు లేవనీ.. కొన్ని చోట్ల వర్షం కారణంగా కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడిందని సీఎం చెప్పుకొచ్చారు.