షాద్నగర్ ప్రైవేట్ స్కూల్లో విషాదం.. మెట్లపై నుంచి జారిపడి నాలుగో తరగతి విద్యార్థిని మృతి
- ఇండియన్ హైట్స్ ప్రైవేట్ స్కూల్లో పాఠశాల వేళల్లో చోటుచేసుకున్న ప్రమాదం
Shadnagar School Tragedy: రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్థానిక ఇండియన్ హైట్స్ ప్రైవేట్ స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్న వర్ణిక అనే విద్యార్థిని ప్రమాదవశాత్తు మెట్లపై నుంచి కిందపడి మృతి చెందింది. పాఠశాల వేళల్లోనే ఈ దుర్ఘటన జరగడంతో తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పాఠశాలలో నడుచుకుంటూ వెళ్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి మెట్లపై నుంచి విద్యార్థిని కిందపడిపోయింది.
ఈ ఘటనలో వర్ణికకు తీవ్ర గాయాలు కావడంతో పాఠశాల యాజమాన్యం వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించింది. అయితే అక్కడ చికిత్స పొందుతూ విద్యార్థిని పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి అకాల మరణంతో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. పాఠశాలలో ఈ ప్రమాదం ఎలా జరిగింది? విద్యార్థిని కిందపడటానికి గల ఖచ్చితమైన కారణాలు ఏంటి? అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పాఠశాలలో పిల్లల భద్రత పట్ల యాజమాన్యం సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందా అన్న కోణంలో సమాచారం రావాల్సి ఉండగా, ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.



