నిజామాబాద్లో యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్య
- చెల్లికి జరిగిన అన్యాయం మరెవరికీ జరగకూడదనే హత్య చేశా: సంతోష్
Nizamabad Crime: నిజామాబాద్లో యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్యకు గురయ్యాడు. నగరంలోని ఆర్ఆర్ చౌరస్తా వద్ద నడిరోడ్డుపై హరిబాబుపై గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేసి హతమార్చారు. కారులో వచ్చిన నిందితులు కాపు కాసి మాటు వేసి ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. గతంలో అదనపు కట్నం కోసం తన చెల్లెలు వైష్ణవిని హరిబాబు హత్య చేశాడని సంతోష్ ఆరోపించాడు. ఈ నేపథ్యంలోనే హరిబాబుపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. అయితే వైష్ణవి మరణానికి సంబంధించిన ఆరోపణలు, ప్రస్తుత హత్యకు గల పూర్తి కారణాలపై పోలీసుల దర్యాప్తులో స్పష్టత రావాల్సి ఉంది.
ఈ ఘటన అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హరిబాబుపై దాడి చేసిన వ్యక్తులు ఎవరనే దానిపై ఆరా తీస్తున్నారు. ఘటనాస్థలిలోని సీసీటీవీ ఫుటేజ్తో పాటు ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. హరిబాబు హత్య కేసులో సంతోష్ పోలీసులకు లొంగిపోయాడు. తన చెల్లెలు వైష్ణవిని హరిబాబు చంపాడని, అందుకే తానే అతడిని హత్య చేసినట్లు సంతోష్ ఓ సెల్ఫీ వీడియోలో వెల్లడించినట్లు సమాచారం.
తన చెల్లికి జరిగిన పరిస్థితి మరెవరికీ ఎదురుకాకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని అతడు పేర్కొన్నాడు.ప్రభుత్వం నుంచి న్యాయం జరుగుతుందని ఎదురుచూశానని, తన చెల్లికి జరిగిన ఘటనలో న్యాయం జరగలేదని భావించి ఈ హత్యకు పాల్పడ్డానని సంతోష్ చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం సంతోష్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హరిబాబు హత్య వెనుక ఉన్న పూర్తి కారణాలు, ఘటనలో మరెవరైనా పాల్గొన్నారా అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.



