ఢిల్లీలో 17 ఏళ్ల బాలికపై దారుణం.. అత్యాచారం చేసి హత్య
- కదులుతున్న టెంపోలో బాలికపై అఘాయిత్యం.. అనంతరం హత్య చేసిన నలుగురు
Delhi Crime: ఢిల్లీలో 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఢిల్లీ–స్వరూప్నగర్ ప్రాంతంలోని కుషాక్ రోడ్ సమీపంలోని పొలాల్లో ఈ నెల 13న బాలిక మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాలిక సెప్టెంబర్ 1న స్నేహితుడిని కలిసేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు గుర్తించారు. ఆమెను మరో స్నేహితుడు టెంపోలో ఎక్కించుకుని, అప్పటికే వాహనంలో ఉన్న మరో ముగ్గురితో కలిసి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
అనంతరం బాలికను హత్య చేసి మృతదేహాన్ని స్వరూప్నగర్లోని పొలాల్లో వదిలేసి నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తూ నిందితుల కోసం గాలింపు చేపట్టారు.టెంపో నంబర్ ప్లేట్ ఆధారంగా పోలీసులు ప్రధాన నిందితుడిగా గుర్తించిన శివమ్ను అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు మరో ముగ్గురు మైనర్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.ఈ ఘటనలో నిందితులంతా బాలికకు పరిచయస్తులేనని పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను పోలీసులు దర్యాప్తు అనంతరం వెల్లడించనున్నారు.



