చేవెళ్లలో రూ.2.5 లక్షల లంచం.. ట్రెజరీ అధికారులను పట్టుకున్న ఏసీబీ
- జీతం బిల్లులు, పెన్షన్ బకాయిల కోసం లంచం డిమాండ్.. ఏసీబీ దాడులు
Chevella ACB: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సబ్ డివిజనల్ ట్రెజరీ కార్యాలయంలో లంచం తీసుకుంటున్న ఇద్దరు ట్రెజరీ అధికారులను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు పట్టుకున్నారు. సెప్టెంబర్ 17న నిర్వహించిన ఈ దాడిలో సబ్ ట్రెజరీ అధికారి మాడిగ లక్ష్మయ్య, అసిస్టెంట్ ట్రెజరీ అధికారి కావలి అనురాధ లంచం వ్యవహారంలో పట్టుబడినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఫిర్యాదుదారుడి సస్పెన్షన్ కాలానికి సంబంధించిన జీతం బిల్లులు, పదవీ విరమణ అనంతరం రావాల్సిన పెన్షన్ బకాయిలను ప్రాసెస్ చేసేందుకు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ పేర్కొంది. ఫిర్యాదుదారుడికి సంబంధించిన సస్పెన్షన్ కాలం జీతం బిల్లుల మొత్తం రూ.23,23,390 కాగా.. పదవీ విరమణ అనంతరం రావాల్సిన పెన్షన్ బకాయిలు రూ.4,29,000గా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
లంచం మొత్తంలో సబ్ ట్రెజరీ అధికారి మాడిగ లక్ష్మయ్య తన కోసం రూ.50 వేల తీసుకున్నట్లు ఏసీబీ వెల్లడించింది. అసిస్టెంట్ ట్రెజరీ అధికారి అనురాధ ఆదేశాల మేరకు వడ్డె జంగయ్య అలియాస్ చిన్నా మరో రూ.50 వేలు తీసుకున్నట్లు పేర్కొంది. ఈ వ్యవహారంలో మొత్తం రూ.2.5 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది. ఏసీబీ అధికారులు నిర్వహించిన ట్రాప్లో నిందితుల నుంచి రూ.1 లక్ష నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం మాడిగ లక్ష్మయ్య, కావలి అనురాధ, వడ్డె జంగయ్యను అదుపులోకి తీసుకుని న్యాయస్థానంలో హాజరుపరిచారు. కోర్టు ముగ్గురికీ జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.



