వైఎస్సార్ కుటుంబంలో మరో శుభకార్యం.. అంజిలి రెడ్డి, రఘురామ్ రెడ్డి వివాహ వేడుకలు
- డిసెంబర్ 5న రిసెప్షన్.. వైఎస్సార్ ఘాట్ వద్ద శుభవార్త పంచుకున్న కుటుంబం
YS Anjili Reddy: వైఎస్సార్ కుటుంబంలో మరో శుభకార్యం జరగనుంది. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో తన కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి, సోమల రఘురామ్ రెడ్డిల వివాహం జరగనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇరువురి కలయిక దైవ సంకల్పంగా భావిస్తూ, వారి నూతన జీవితానికి ఇది శుభారంభమని పేర్కొన్నారు. ఈ నెల 24న అంజిలి రెడ్డి, రఘురామ్ రెడ్డిల నిశ్చితార్థం నిర్వహించనున్నారు. నవంబర్ 25న వివాహ వేడుక జరగనుండగా.. డిసెంబర్ 5న రిసెప్షన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ శుభవార్తను దేవుడి ఆశీర్వాదంతో ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వేదికగా కుటుంబ సభ్యులు పంచుకున్నారు.
వివాహానికి సంబంధించిన తొలి ఆహ్వాన పత్రికను అంజిలి రెడ్డి కుటుంబ సభ్యులు, రఘురామ్ రెడ్డి తల్లిదండ్రులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఉంచి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. అంజిలి రెడ్డి, రఘురామ్ రెడ్డిల దాంపత్య జీవితం నూరేళ్ల పాటు సుఖసంతోషాలతో సాగాలని కుటుంబ సభ్యులు ఆకాంక్షించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి చూపిన సన్మార్గం తమ పిల్లలకు ఎల్లప్పుడూ ఆదర్శంగా ఉంటుందని పేర్కొన్నారు. ఆయన ఆశీస్సులు వారి జీవితాలకు కొండంత అండగా నిలవాలని కోరుకున్నారు.



