ముంబైలో వైభవంగా లాల్బాగ్చా రాజా గణేష్ ఉత్సవాలు
- లాల్బాగ్చా రాజా దర్శనం కోసం పోటెత్తిన వేలాది మంది భక్తులు
Mumbai Ganesh Festival: ముంబైలో గణేష్ ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గణేష్ చతుర్థి సందర్భంగా ప్రముఖ లాల్బాగ్చా రాజా గణపతిని దర్శించుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 14న గణేష్ చతుర్థితో ప్రారంభమైన లాల్బాగ్చా రాజా ఉత్సవాలు సెప్టెంబర్ 25న అనంత చతుర్దశి వరకు 12 రోజుల పాటు కొనసాగనున్నాయి. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు తరలిరావడంతో లాల్బాగ్ పరిసర ప్రాంతాలు భక్తుల సందడితో కిక్కిరిసిపోతున్నాయి.
లాల్బాగ్చా రాజా సర్వజనిక్ గణేశోత్సవ్ మండలి ఆధ్వర్యంలో ఈ ఏడాది 93వ వార్షిక గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా గణపతిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని మండలి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసింది. స్వామివారిని దర్శించుకునేందుకు ‘ముఖ దర్శనం’ లైన్తో పాటు గణపతి పాదాలను తాకి మొక్కులు చెల్లించుకునేందుకు ‘చరణ్ స్పర్శ్’ లైన్ను కూడా అందుబాటులో ఉంచారు. అనంత చతుర్దశి రోజున లాల్బాగ్చా రాజా గణపతి నిమజ్జనంతో ఈ ఏడాది ఉత్సవాలు ముగియనున్నాయి. నిమజ్జన వేడుకలను చూసేందుకు కూడా భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో నిర్వాహకులు, అధికారులు అవసరమైన ఏర్పాట్లపై దృష్టి సారిస్తున్నారు.



