పోలీస్ స్టేషన్లలో ఏఐ సేవలు.. మెహదీపట్నంలో స్మార్ట్ కియోస్క్ ‘సేతు’ ప్రారంభం
- ఏఐతో క్షణాల్లో ఫిర్యాదు నమోదు.. హైదరాబాద్ పోలీసుల వినూత్న స్మార్ట్ కియోస్క్ ‘సేతు’
Hyderabad City Police: పోలీస్ స్టేషన్ గడప తొక్కాలంటే సామాన్యుడికి ఉండే బెరుకును పోగొట్టి, బాధితుల్లో తక్షణ న్యాయం జరుగుతుందన్న కొండంత ధైర్యాన్ని నింపేందుకు హైదరాబాద్ సిటీ పోలీస్ సరికొత్త సాంకేతికతకు శ్రీకారం చుట్టింది. అత్యాధునిక కృత్రిమ మేధ (AI) ఆధారంగా పనిచేసే స్మార్ట్ కియోస్క్ ‘సేతు’ను మెహదీపట్నం పోలీస్ స్టేషన్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది. పోలీసు వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఈ వినూత్న నిర్ణయం తీసుకుంది.
ఈ స్మార్ట్ కియోస్క్ ద్వారా బాధితులు తమ సొంత భాషలోనే స్వేచ్ఛగా మాట్లాడి సమస్యను వివరించవచ్చు. కృత్రిమ మేధ సాంకేతికతతో ఆ ఫిర్యాదును తక్షణమే డిజిటల్ రూపంలో నమోదు చేస్తారు. అంతేకాకుండా, ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ ఎంతవరకు వచ్చిందో ఎప్పటికప్పుడు పారదర్శకంగా ట్రాక్ చేసుకునే వెసులుబాటును ఈ వ్యవస్థ కల్పిస్తుంది. పోలీస్ స్టేషన్ రిసెప్షన్ వద్దే ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం, సత్వర పరిష్కారం లభించేలా ఈ ‘సేతు’ ప్రజలకు, పోలీసులకు మధ్య బలమైన నమ్మక వారధిగా నిలుస్తుందని అధికారులు తెలిపారు.
ప్రజా సంక్షేమమే కేంద్రబిందువుగా సాగే పోలీసింగ్ విధానంలో భాగంగా ఈ సదుపాయాన్ని తీసుకువచ్చామని, త్వరలోనే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లకు దశలవారీగా దీన్ని విస్తరిస్తామని వెల్లడించారు. నగర పౌరులంతా ఈ ఏఐ స్మార్ట్ కియోస్క్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని, ప్రజాహిత పోలీసింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు తమ విలువైన సూచనలు అందించాలని హైదరాబాద్ సిటీ పోలీస్ పిలుపునిచ్చింది.



