కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

  • తెలంగాణకు మరో 9.56 లక్షల ఇళ్లు కేటాయించాలి: కేంద్ర మంత్రిని కోరిన సీఎం

Revanth Reddy: హైదరాబాద్ మాదాపూర్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ (PMAY-G) కింద తెలంగాణకు తొలి విడతగా 2 లక్షల ఇళ్లు కేటాయించినందుకు కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. గత జూలైలో ఢిల్లీలో చౌహాన్‌ను కలిసిన సందర్భంగా రాష్ట్రంలోని 11,56,915 అర్హులైన గ్రామీణ కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేయాలని వినతిపత్రం అందించిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ప్రస్తుతం మంజూరైన 2 లక్షల ఇళ్లకు అదనంగా మిగిలిన 9.56 లక్షల ఇళ్లను కూడా రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా కేటాయించాలని కోరారు.

Read More జైనూర్‌లో భారీగా గంజాయి మొక్కలు స్వాధీనం

సమావేశంలో ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై కూడా సీఎం కేంద్ర మంత్రికి వివరించారు. వర్షాభావం కారణంగా వ్యవసాయ రంగంలో విద్యుత్ వినియోగం పెరిగిందని, తాగునీరు, విద్యుత్ కొరత తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసిందని తెలిపారు. ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు వ్యవసాయ రంగానికి కేంద్రం నుంచి అవసరమైన సహకారం అందించాలని కోరారు.

రాష్ట్రంలో రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సహిస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. పంట మార్పిడిని ప్రోత్సహించేందుకు అవసరమైన సహకారం అందించాలని కేంద్రాన్ని కోరారు. అలాగే పేదలకు రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం అందిస్తున్నామని, సన్న వడ్ల సాగును ప్రోత్సహించేందుకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తున్నామని సీఎం వివరించారు.

మరోవైపు 250 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్రూట్స్‌, వెజిటబుల్ మార్కెట్‌ను ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు. వ్యవసాయ రంగంలో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల వైవిధ్యీకరణ, ప్రత్యామ్నాయ పంటలు, నీటి సంరక్షణ వంటి అంశాల్లో కేంద్ర సహకారం అవసరమని రేవంత్ రెడ్డి కోరారు. PMAY-Gతో పాటు గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు అంశాలపై ఇరువురు చర్చించారు.