లోన్ యాప్ వేధింపులకు మరో విద్యార్థి సూసైడ్

లోన్ యాప్ వేధింపులకు మరో విద్యార్థి సూసైడ్

విశ్వంభర తాడేపల్లి : లోన్ యాప్ లో రుణాలు తీసుకొని కట్టే స్తోమత లేక యువత ప్రాణాలు తీసుకుంటున్నారు. లోన్ నిర్వాకులు డబ్బులు కట్టాలని ఇబ్బందులకు గురి చేయడంతో, అటు ఇంట్లో వాళ్లకు తెలిస్తే పరువు పోతుంది అని భావించి బలవంతంగా జీవం విడుస్తున్నారు. కన్నవారికి కడుపుకోత మిగులుస్తున్నారు. ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.

విద్యార్థి మృతదేహం గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద కృష్ణా నదిలో లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విజయవాడకు చెందన మురికింటి వంశీ (22) ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఇంట్లో తెలియకుండా లోన్ యాప్ లో రూ. 10 వేల రుణం తీసుకున్నాడు. అయితే యాప్ నిర్వాహకులు రూ. లక్ష కట్టాలంటూ వంశీని వేధించారు. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పేందుకు భయపడిన విద్యార్థి... ఈ నెల 25న ఇంటి నుంచి వెళ్లిపోయాడు.

తాను చనిపోతున్నానంటూ కుటుంబ సభ్యులకు మెసేజ్ పెట్టాడు. ఆ తర్వాత నుంచి ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. ఆందోళలకు గురైన కుటుంబ సభ్యులు రెండు రోజులుగా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో తాడేపల్లి లో కృష్ణా నది వద్ద మొబైల్​ ఫోన్, చెప్పులు, బైక్ కనిపించాయి. నదిలో గాలింపు చేపట్టగా వంశీ మృతదేహాన్ని గుర్తించారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags: Suicide

Related Posts