ఉర్దూ పాఠశాలల వేళల్లో మార్పు
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలోని ఉర్దూ మీడియం పాఠశాలల పనివేళల్లో కీలక మార్పులు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలోని ఉర్దూ మీడియం పాఠశాలల పనివేళల్లో కీలక మార్పులు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. 2026 ఫిబ్రవరి 17 లేదా 18 నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో, విద్యార్థులు, ఉపాధ్యాయుల సౌకర్యార్థం ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, మరియు అన్-ఎయిడెడ్ ఉర్దూ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పాఠశాలలు ఉండనున్నాయి. రంజాన్ ప్రారంభం నుండి మార్చి 20, 2026 వరకు ఈ పనివేళలు అమలులో ఉండనున్నాయి. మార్చి 20 తర్వాత తిరిగి యథావిధిగా పాత పనివేళలే అమలులోకి వస్తాయి.
2002 అక్టోబరు 31 నాటి స్టాండింగ్ ఆర్డర్ను అనుసరిస్తూ ఉర్దూ, మైనారిటీ భాషా పాఠశాలల డైరెక్టరేట్ ఈ నిర్ణయం తీసుకుంది. సాధారణ పాఠశాలల్లో పనిచేసే ముస్లిం ఉపాధ్యాయులు, విద్యార్థులు కూడా సాయంత్రం నిర్ణీత సమయం కంటే అరగంట ముందుగానే ఇంటికి వెళ్లేందుకు ప్రత్యేక అనుమతి లభించింది. ఎండల తీవ్రత, ఉపవాస దీక్షల (రోజా) వల్ల కలిగే అలసటను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించింది.



