ఏపీ కొత్త సీఎస్గా నీరభ్ కుమార్?
ఏపీలో ప్రభుత్వం మారడంతో గత ప్రభుత్వంలో కీలకంగా పని చేసిన అధికారుల్లో టెన్షన్ మొదలైంది. తాజా సమాచారం ప్రకారం కొత్త సీఎస్గా 1987 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ నీరబ్ కుమార్ ప్రసాద్ను టీడీపీ అధినేత చంద్రబాబు నియమించాలనుకుంటున్నారని తెలుస్తోంది.
ఏపీలో ప్రభుత్వం మారడంతో గత ప్రభుత్వంలో కీలకంగా పని చేసిన అధికారుల్లో టెన్షన్ మొదలైంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఆయన గురువారం చంద్రబాబుతో భేటీ అయి వ్యక్తిగత కారణాలతో సెలవుపై వెళుతున్నట్లు కాబోయే ముఖ్యమంత్రికి ఆయన తెలిపినట్లు సమాచారం. ఇదే నెలతో ప్రస్తుత సీఎస్ జవహర్రెడ్డి పదవీ కాలం కూడా ముగియనుంది.
ఈ నెలాఖరు వరకు ఆయన పదవీ విరమణ చేయనున్నారు. అయితే ఇప్పుడు సీఎస్ సెలవు మీద వెళ్ళగానే కొత్త సీఎస్ను నియమించే అవకాశం ఉండగా ఆయన స్థానంలో ఇంతకు ముందు కె. విజయానంద్ను నియమిస్తారని కథనాలు వచ్చాయి. కానీ ప్రస్తుతం తెలుస్తున్న సమాచారాన్ని బట్టి కొత్త సీఎస్గా 1987 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ నీరబ్ కుమార్ ప్రసాద్ను టీడీపీ అధినేత చంద్రబాబు నియమించాలనుకుంటున్నారని తెలుస్తోంది.
ఆయన గతంలో చంద్రబాబు హయాంలో కీలక శాఖలకు ముఖ్య కార్యదర్శిగా పని చేశారు. ప్రస్తుతం అటవీ, పర్యావరణ,సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయన తర్వాత అనంతరాములు, శ్రీలక్ష్మి, గోపాలకృష్ణ ద్వివేది, రజత్ భార్గవ్ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయినప్పటికీ నీరబ్ కుమార్ వైపే చంద్రబాబు మొగ్గు చూపిస్తున్నట్లు సమాచారం. అయితే, దీనికి సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది.